స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన జనతా వస్త్రాల పథకం అప్పట్లో ఒక సంచలనం. భారతదేశంలో గౌరవ ఆధారిత సంక్షేమానికి రోల్ మోడల్ ఎన్ టీఆర్.ఆయన పథకాలు కాగితాల పై కాకుండా ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. అలాంటి అరుదైన సంక్షేమ కార్యక్రమాల్లో ఎన్.టి.ఆర్ ప్రవేశపెట్టిన జనతా వస్త్రాలు పంపిణీ పథకం ఒకటి.పేదవాడికి ఆయన ఇచ్చిన అసలైన కానుకలు.కూడు,గూడు,గుడ్డ ఇవి మనిషి కనీస అవసరాలు.ఆ మూడింటినీ ఒకేసారి అందించిన మహనీయుడు ఎన్.టి.ఆర్. జనతా వస్త్రాల పథకం ద్వారా ఆయన ప్రతి పేదవాడి గుండెకు చేరువయ్యారు.1983 లో ఎన్.టి.ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాలనలో పేదవాడికి అన్నం మాత్రమే కాదు గౌరవం కూడా కావాలని ప్రధాన సిద్ధాంతం .ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతంలో తీవ్రమైన పేదరికం ఉండేది. ముఖ్యంగా పండుగల సమయంలో కొత్త బట్టలు కూడా కొనలేని కుటుంబాలు,బడికి వెళ్లే పిల్లలు చినిగిన దుస్తులతో వెళ్లడం వృద్ధులు, కార్మికులు ఒకే జత బట్టలు వేసుకునే పరిస్థితి. దీనిని ఆర్థిక సమస్య కంటే సామాజిక అవమానంగా చూశారు ఎన్టీఆర్.అది ప్రభుత్వ సహాయం కాకుండా సమాజంలో పేదల గౌరవాన్నిఇచ్చారు.అందుకే ఆయన సంక్షేమాన్ని కేవలం పొట్ట నింపడానికే పరిమితం చేయలేదు. ఆత్మగౌరవాన్ని రక్షించడమే పరిపాలన అసలు ఉద్దేశం అని నిరూపించారు ఎన్ టి ఆర్. కిలో రెండు రూపాయల అన్నపూర్ణ పథకం ఆకలిని తగ్గిస్తే, జనతా వస్త్రాలు అవమానాన్ని తగ్గించాయి.

ఒకే నిర్ణయంతో రెండు వర్గాల జీవితాల్లో వెలుగు,
పేదవాడు గౌరవంగా జీవించడం ప్రాధమిక హక్కు అన్న ప్రగాఢ విశ్వాసంతో జనతా వస్త్రాల పథకానికి శ్రీకారం చుట్టారు ఎన్ టీ ఆర్. ఈ పథకం వెనుక ఒక గొప్ప మానవీయ కోణం, మరొక గొప్ప దూరదృష్టి ఉంది.ఒకే నిర్ణయంతో రెండు వర్గాల జీవితాల్లో వెలుగు నింపారు పేదలకు గౌరవం ,నేతన్నలకు ఉపాధి.సగం ధరకే చీర-ధోవతి ని అందించడం తో పేదలకు తక్కువ ధరకే దొరకడంతో పాటు నేతన్న చేతికి పని, పేదవాళ్ళకి ఒంటి నిండా బట్ట కల్పించినట్లు అయింది.నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులు సరైన పని లేక, గిట్టుబాటు ధర రాక ఆకలితో అలమటిస్తున్నారు. మరోవైపు పేదరికం కారణంగా కట్టుకోవడానికి సరైన బట్ట లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. ఈ రెండు సమస్యలకు పరిష్కారంగా ఎన్.టి.ఆర్ తెచ్చిన ఆలోచనే ఈ పథకం ఉద్దేశ్యం. గ్రామాల్లోని చేనేత సహకార సంఘాల దగ్గరకు వెళ్లి నేరుగా వస్త్రాలను సేకరించడం ద్వారా మధ్యవర్తుల దోపిడీని అరికట్టారు.సేకరించిన ఆ వస్త్రాలను ఆప్కో ద్వారా పల్లెపల్లెకూ చేరవేసి,అత్యంత తక్కువ ధరకు పేదలకు అందించారు.ఒక సామాన్య గృహిణి పండగ పూట కొత్త చీర కట్టుకోవాలని ఆరాటపడుతుంది. ఒక శ్రామికుడు తన పాత పంచె చిరిగిపోతే తలవంచుకుంటాడు.ఆనాడు జనతా వస్త్రాలు కేవలం బట్టలు మాత్రమే కాదు, అవి ఆ పేదవారి పట్ల ఎన్ టి ఆర్ చూపిన మమకారం.మురికివాడల్లో, మారుమూల పల్లెల్లో ఎంతోమంది తల్లులు,వృద్దులు ఆ జనతా చీర,ధోవతి ని కట్టుకున్నప్పుడు వారి కళ్లలో కనిపించిన ఆనందం వర్ణించలేనిది.
పల్లెల్లో ఆర్థిక చైతన్యం,
ఈ పథకం కింద అతి తక్కువ ధరకే సబ్సిడీపై ధోవతులు మరియు చీరలను పంపిణీ చేసారు. మార్కెట్ ధరతో పోలిస్తే ఇవి చాలా తక్కువగా ఉండటంతో, రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు బట్టల కోసం చేసే ఖర్చు గణనీయంగా తగ్గింది.ఈ పథకానికి కావలసిన వస్త్రాలను ప్రభుత్వం నేరుగా చేనేత సహకార సంఘాల ద్వారా సేకరించేవారు. దీనివల్ల మిల్లు బట్టల ధాటికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న చేనేత కార్మికులకు చేతినిండా పని దొరికింది.వేలాది మంది నేతన్నల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించింది.చేనేత రంగం పతనం కాకుండా నిలబడటానికి ఈ పథకం ఒక బూస్టర్ డోస్ లా పని చేసింది.చేనేత వృత్తి ప్రధానంగా గ్రామాల్లో కేంద్రీకృతమై ఉంటుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు నేరుగా గ్రామీణ వృత్తి పనివారికి చేరడం వల్ల, పల్లెల్లో ఆర్థిక చైతన్యం పెరిగింది.తరువాత అనేక రాష్ట్రాలు చీరలు, ధోతీలు పంపిణీ పథకాలు ప్రారంభించాయి.పేదవాడికి బట్టలు ఇచ్చిన నాయకులు చాలామంది ఉంటారు.కాని పేదవాడికి గౌరవం ఇచ్చిన నాయకుడు మాత్రం ఎన్.టి.ఆర్ అని చెప్పాలి.ఆయన ప్రవేశపెట్టిన ఈ జనతా వస్త్రాల పథకం మరియు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాలు అప్పట్లో సంక్షేమ పాలనకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చాయి.పేదరికంలో ఉన్నవారు చిరిగిన బట్టలతో కాకుండా,కొత్త వస్త్రాలతో గౌరవప్రదంగా సమాజంలో తిరగాలన్న ఆశయం తో ఎన్టీఆర్ జనతా వస్త్రాల పథకం ప్రారంభించారు.












