
ఎన్ఠీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పాలనా వ్యవస్థలో తెచ్చిన విప్లవాత్మక మార్పులలో అత్యంత కీలకమైనది రైతులకు మేలు చేకూర్చే సింగిల్ విండో, ఏక గవాక్ష విధానం. అప్పట్లో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మరియు రుణాలు పొందాలంటే వేర్వేరు కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ క్లిష్టమైన ప్రక్రియను సరళీకృతం చేస్తూ, రైతు ముంగిటకే సేవలు అందించడమే లక్ష్యంగా ఏక గవాక్ష పద్ధతిని అమలులోకి తెచ్చారు ఎన్ఠీఆర్.ఇది కేవలం ఒక పరిపాలనా సంస్కరణ మాత్రమే కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చిన ఒక సామాజిక విప్లవం.ఆరోజుల్లో వ్యవసాయం జీవనాధారం అయిన, రైతుకు అవసరమైన సమయంలో రుణం అందకపోవడం పెద్ద సమస్యగా ఉండేది.ఈ సమస్యను లోతుగా అర్థం చేసుకున్న రైతు నాయకుడు నందమూరి తారక రామారావు సహకార రంగంలో ఒక కీలక మార్పుకు శ్రీకారం చుట్టి 1987లో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సింగిల్ విండో ఏక గవాక్ష విధానాన్ని అమలులోకి తెచ్చారు.ఆయన రైతుల కష్టాలను అర్ధం చేసుకొన్న గొప్ప పాలకుడు.ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సహకార రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు నేటికీ రైతులకు దిక్సూచిగా ఉన్నాయి.
రైతుకు ఒకే కేంద్రంలో అన్ని రుణాలు!
అప్పట్లో సహకార సంఘాలు మూడు వేర్వేరు విభాగాల ద్వారా పనిచేసేవి రుణాల కోసం ఒకటి, మార్కెటింగ్ కోసం ఒకటి, విత్తనాల కోసం మరొకటి. ఎన్టీఆర్ వీటన్నింటినీ విలీనం చేసి, రైతుకు కావాల్సినవన్నీ ఒకే చోట దొరికేలా చేశారు. స్వల్పకాలిక, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలను ఒకే విండో ద్వారా రైతులకు అందజేశారు. విత్తనాలు, ఎరువులు మరియు క్రిమిసంహారక మందులను సొసైటీల ద్వారా నేరుగా రైతులకు అందించారు.అప్పటివరకు విడివిడిగా ఉన్న 218 ప్రాథమిక వ్యవసాయ అభివృద్ధి బ్యాంకులను 4,610 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో విలీనం చేశారు. దీనివల్ల రైతులకు పంట రుణాలతో పాటు, వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన దీర్ఘకాలిక రుణాలు కూడా ఒకే చోట లభించే వెసులుబాటు కలిగింది. దీనివల్ల రైతులకు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పడమే కాకుండా, మధ్యవర్తుల ప్రమేయం కూడా తగ్గింది.రైతుకు ఒకే కేంద్రంలో అన్ని రుణాలు, గ్రామ స్థాయిలోనే బ్యాంకింగ్ సేవలు,మధ్యవర్తుల నిర్మూలన, సమయానికి రుణాల మంజూరు, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహం కల్పించే వారు.రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి, నిల్వ చేసుకోవడానికి గిడ్డంగుల సౌకర్యాన్ని ఈ వ్యవస్థతో అనుసంధానించారు.సింగిల్ విండో విధానంలో భాగంగా సహకార సంఘాల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించారు. దీనివల్ల వెనుకబడిన వర్గాలకు [ బీసీ-ఎస్సి- ఎస్టీ] లకు కూడా పాలకమండలిలో ప్రాతినిధ్యం లభించింది.: ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఈ సింగిల్ విండో విధానం ఎంత విజయవంతమైందంటే, తర్వాతి కాలంలో అనేక రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని స్ఫూర్తిగా తీసుకుని తమ సహకార వ్యవస్థలను బలోపేతం చేసుకున్నాయి.రైతుల కోసం ఎన్టీఆర్ చేసిన ఇతర ముఖ్యమైన పనులు, రైతులకు అతి తక్కువ ధరకే విద్యుత్ అందించి సాగును లాభసాటిగా మార్చారు. రాయలసీమ నెర్రెలు బారిన భూములకు సాగునీరు అందించేందుకు అపర భగీరథుడిలా కృషి చేశారు. పంట పండించడమే కాదు, దానికి సరైన ధర దక్కాలని తపించిన నాయకుడు ఆయన. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఈ సింగిల్ విండో సిస్టమ్ నేటికీ సహకార రంగంలో అతిపెద్ద సంస్కరణగా నిలిచిపోయింది. అందుకే ఆయనను తెలుగు రైతాంగం ఇప్పటికి రైతు బాంధవుడు అని పిలుచుకుంటుంది.












